ఎన్నికల్లో ధన వర్షం రోజుకు రూ.100కోట్లు సీజ్..
TGWNEWS/ఢిల్లీ : లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రలోభాలకు గురికాకుండా చూసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) అన్ని చర్యలు తీసుకుంటోంది..
ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ముమ్మర తనిఖీలు చేపట్టింది. ఇందులో భాగంగా మార్చి 1 నుంచి నిత్యం సగటున రూ.100 కోట్ల విలువైన నగదు ఇతర తాయిలాలను అధికారులు సీజ్ చేస్తున్నట్లు ఈసీ వెల్లడించింది. దేశవ్యాప్తంగా కొనసాగుతోన్న తనిఖీల్లో ఇప్పటి వరకు మొత్తంగా రూ.4650 కోట్లను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది.. 2019తో పోలిస్తే ఇది చాలా ఎక్కువ అని తెలిపింది. అంతేకాకుండా లోక్సభ ఎన్నికల చరిత్రలో ఈ స్థాయిలో ఎన్నడూ తాయిలాలను సీజ్ చేయలేదని పేర్కొంది. ఎన్నికల్లో ధనప్రవాహం, ప్రలోభాలకు అడ్డుకట్ట వేసేందుకు ఈ తనిఖీలు ముమ్మరం చేస్తామని చెప్పింది. దేశవ్యాప్తంగా ఫ్లయింగ్ స్క్వాడ్, నిఘా బృందాలతో సహా సరిహద్దు చెక్పోస్టులు నిరంతరం పనిచేస్తున్నట్లు ఈసీ వెల్లడించింది. మాదకద్రవ్యాల రవాణాతోపాటు నగదు, మద్యం, తాయిలాల పంపిణీని అడ్డుకునేందుకు కృషి చేస్తున్నామని తెలిపింది. ఇదిలాఉంటే, ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు మొత్తం ఏడు దశల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న లెక్కింపు ఉంటుంది..

0 Comments