TGWNEWS/యాదాద్రి :ఇటీవలే పునర్నిర్మాణం చేసిన యాదాద్రి శ్రీలక్ష్మీ నర్సింహస్వామి ఆలయంలో భక్తులకు ఇంకా కనీస స్థాయి వసతులు సమకూరక పోవడం విమర్శలకు దారి తీస్తోంది. సోమ మంగళ బుధ వారాలలో పగటి పూట ఎండ తీవ్రతకు కొండ పైన భక్తులు విలవిల లాడుతున్నారు. 43 డిగ్రీలు దాటుతున్న ఎండ ధాటికి కృష్ణ శిలలతో నిర్మించిన ప్రధానాలయం, దాని పరిసరాలు మరింత వేడెక్కుతున్నాయి. ప్రధానాలయంలో సెంట్రల్ ఏసీలో శ్రీస్వామి దర్శనం చేసుకుని బయటకు వచ్చిన భక్తులకు ఎండ వేడిమితో పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. ప్రసాదాల కొనుగోలుకు, శివాలయానికి వెళ్లడానికి, కొండపైన బస్టాండ్కు వెళ్లడానికి కాలినడకన వెళ్లాల్సిన ప్రాంతాలు నిప్పుల కుంపటిలా మారాయి. స్వామి దర్శనం కోసం చెప్పులు లేకుండా వెళ్లే భక్తులు తిరుగు ప్రయాణంలో పాదాలు కాలుతుండడంతో పరుగులు తీస్తున్నారు. పిల్లలతో వచ్చిన వారి పరిస్థితి దయనీయంగా ఉంది. వృద్ధులు కాళ్లకు సాక్స్ మాదిరిగా టవల్స్ చుట్టుకుని నడుస్తున్నారు. భక్తులకు కనీస వసతులు కల్పించవలసిన దేవస్థానం చేతులెత్తేసింది. చలువ పందిళ్లు, జూట్ మ్యాట్లు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయలేదు. కేవలం కొంత ప్రాంతంలో వైట్ కూలింగ్ పేయింట్ వేసి చేతులు దులుపుకుంది. వేసిన కొన్ని జ్యూట్ మ్యాట్లపై వాటిపై క్రమం తప్పకుండా నీళ్లు చల్లడంలేదు. మంచినీటి నల్లాల వద్ద ఎలాంటి నీడ లేకపోవడంతో వాటి నుంచి చల్లని నీటికి బదులు వేడి నీరు వస్తోంది. దీంతో కొండపైన నీటి వ్యాపారం జోరందుకుంది. వ్యాపారులు రూ.20 ఉన్న కూల్ వాటర్ బాటిల్ రూ.30కి విక్రయిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు పట్టించుకోని ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయాలనీ భక్తులు కోరుతున్నారు.
0 Comments